*తిరుప్పావై – 2 పాశురం*
(17.12.21)
*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం*
*వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు*
*శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్*
*పైయత్తుయిన్ఱ పరమనడి పాడి*
*నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి*
*మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్*
*శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ*్
*ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి*
*ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్*
చెలులందరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత గోదాదేవి ఆ వ్రత నియమాలను ఈ పాశురంలో వివరించింది.. భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శ్రీకృష్ణుడు అవతరించిన లోకంలో పుట్టి దుఃఖమయమైన జీవితం గడుపుతున్నా ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నవారలారా ఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్పరుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రించుచున్న శ్రీహరి యొక్క పాదపద్మములకు మంగళము పాడుదాము. ఈ వ్రతం ఆచరించు సమయంలో నేతిని, పాలను గాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళాన్ని ఇచ్చే పూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు, అసత్యాలు ఎప్పుడు గాని, ఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించే కష్టములు కలిగించే పనులనుగాని, ఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి ధనధాన్యాలతో సత్కరిస్తాము.
బ్రహ్మచారులకు, బిక్షువులకు బిక్ష పెడతాము. భగవంతుని గుణగణనము చేస్తూ ఈ సంసార బంధనాలనుండి విముక్తి పొండడం గురించి ఆలోచిస్తాం .. శాస్త్రముకంటే నిర్దిష్టమైన క్రమము కంటే భక్తి ప్రధానమైంది. భగవత్కృప, గురు కృప చాలా ముఖ్యమైనవని భావిస్తాము. దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. శ్రీకృష్ణునిసేవకే అంకితమైనందున తన యవ్వనమంతా ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన గోడాదేవి ఈ పాశురంలో వ్రత నియమాలు చెప్పింది.
*వ్రతనియమాలు*
మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు, శాస్త్రాలలో ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం *నీవాడను నేను* అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.
భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. *అణు:* అతి చిన్నరూపం నుండి *బృహత్:* అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. *శబ్ద సహ* అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, *శబ్దాతిగ* చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!
ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం, రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు, రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వ్రేళ్ళతో పోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలును బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.
*వైయత్తు వాళ్ వీర్గాళ్!* ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికు చూసిరమ్మని చెబితే కాల్చి వెళ్ళ లేదా నీవు? దానికి హనుమ *మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మా?* అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.
*నాముం నం పావైక్కు* ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. *శెయ్యుం కిరిశైగళ్ కేళీరో* మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, *పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి* పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి *పరమన్* అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా,
అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర. మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి.
*వ్యుహం-పాల్కడలి*
నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.
ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.
అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.
ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు, మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.
ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది- ఇక *నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్* నెయ్యి వద్దు పాలు వద్దు. *నాట్కాలే నీరాడి* తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. *మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్* కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. *శెయ్యాదన శెయ్యోమ్* మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం – ప్రాచీణ ఆచారాలు మానెయ్యం *తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్* పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. *ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి* చేతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. *ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్* ఇవన్ని ఆనందంతో చేస్తాం.
*శ్రీ ఆండాళ్ తల్లి తిరువడిగలే శరణం*
*శ్రీమన్నారాయణ*
🌹 తిరుప్పావై రెండవ పాశురము 🌹
( సేకరణ. పి.యల్.నరసింహాచార్య దాసన్)
(17.12.21)
వ్రత సమయములో చేయదగినవి; చేయతగనివి మొదలైన వాటి గురించి వివరణను ఈ పాశురములో గోదమ్మ తల్లి చెపుతూంది. మొదటి పాశురములో వ్రేపల్లె లోని పడుచులను మాత్రమే ప్రధానంగా పిలిచింది; కానీ ఈ పాశురమున భూమండలములో ఉన్న వారందరినీ ఆహ్వానిస్తున్నది ఆణ్డాళ్ తల్లి!
వైయత్తు వాళ్ వీర్ గాళ్ నాముమ్ నమ్ పావైక్కు శెయ్యుం కిరిశైగళ్ కేళీరో
పార్కడలుళ్ పైయత్తుయన్ర పరమన్ అడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాకుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయుట్టు ఎళుదోం (మైయిట్టెళుదోమ్) మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కురళై శెన్రు ఓదోం (చెన్నోదోం)
ఐయముం పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యుమారెణ్ణి ఉగన్దేలోరెంబావాయ్
ప్రతి పదార్థాలు:
వైయత్తు వాళ్వీర్గాళ్ ~ ఈ భూమియందు ఉన్న ఆనందమనుభవించుటకు జన్మించిన వారలారా!
నాముమ్ నంబావైక్కు ~ మేమున్నూ మా వ్రతానికి;
చెయ్యుమ్ కిరి శైగళ్~ చేయు కృత్యములను;
కేళీరో~ వినండి;
పార్ కడలుళ్~ పాల కడలి యందు;
పైయత్తు ఇన్ఱ~ సావధానముగా తూగిన;
పరమన్ అడి పాడి ~ పరముని పదములను స్తుతించి;
నెయ్యుణన్నోమ్ పాలుణ్ణోమ్~ నెయ్యి తినము; పాలు త్రాగము;
నాట్కాలే నీరాడి ~ వేకువనే జలక మాడి;
మై ఇట్టు ఎళుదోమ్~ కాటుక పెట్టుకొనము;
మలరిట్టు నా ముడియోమ్~ పూలు పెట్టి ముడువము;
శెయ్యాదన శెయ్యోమ్ ~ చేయరానిది చెయ్యము;
తీక్కురళై చెన్ రో దోమ్ ~ చాడీలు చెప్పము;
ఐయ్యముమ్ పిచ్చెయుమ్ ~ దానమునూ బిచ్చమునూ;
ఆందనైయుమ్ కైకాట్టి~ యధా శక్తి ఇచ్చి;
ఉయ్యుమ్ ఆరు ఎణ్ణి~ ఉజ్జీవన మార్గమును అవలంబించి;
ఉగందు ఏలో రెంబావాయ్ ~ ఆనందించెదము.
భావము:
శ్రీకృష్ణ భగవానుడవతరించిన కాలమున, ఈ భూలోకమున పుట్టి దుఃఖమయమగు సంసారమున ఆనందమునను భవించుచున్న
అదృష్టవంతులారా! మేము మా వ్రతమునాచరించు విధానమును తెలిపెదము. తెల్లవారుఝాముననే లేచి, స్నానమాడి, క్షీరసాగరమున మెల్లగా పడుకుని ఉన్న పరమపురుషుని పాదములను కీర్థించెదము. నేతిని భుజింపము. పాలను ఆరగింపము. కంటికి కాటుక పెట్టుకొనము. పూలను ముడువము, పెద్దలు చేయని వానిని చెయ్యము. ఇతరులపై చాడీలు చెప్పము. దానమును, బిక్షమును పుచ్చుకొనువారికి తృప్తి కలుగునంత వరకూ ఇచ్చి ఉజ్జీవించు
విధమును అరయుదుము!
ఇది ఈ పాశుర తాత్పర్యము!
వ్యాఖ్య:
ఈ పాశురములో గోదమ్మ తనతోటివారితో ఇలా చెబుతూ ఉంది: భూలోకాన అభివృద్ది గలవారలారా! మీ భాగ్యానికి అంతులేదు. ఐహిక సమస్త సౌఖ్యాలను అనుభవించు చున్నారు; మీ పూర్వజన్మ సుకృతము గొప్పది. అందుకే ఇంత సంపన్న కుటుంబమున జన్మించినారు; కొదవలేని భోగాలను అఉభవించు చున్నారు. శ్రీమన్నారాయణుడే కృష్ణావతారుడై జన్మించిన వ్రేపల్లె యందు అతని సమకాలికులుగా పుట్టడమంటే సామాన్యభాగ్యమా మరి! కానీ ఈ లౌకిక భాగ్యాలు శాశ్వతములా? వీటివల్ల పూర్వజన్మ సుకృతము తరుగుచున్నది. కృష్ణ సమాకాలీనులము మాకేమి? ఆముష్మిక సౌఖ్యములకు కొదవ ఏమి? అలా అనకండి; గంగాజలము పాపనాశకమై స్వర్గ ఫలాన్నిస్తుంది ~ కానీ అందులోని చేపలూ ఎండ్రకాయలూ మొసళ్ళు స్వర్గానికి పోగలవా? భక్తి శ్రద్ద లేని కార్యాలు ఫలించునా? మేము సంపన్న కుటుంబాన పుట్ఘినా ఈ సంపదలు శాశ్వతాలు కావు, క్షణికాలు
మాత్రమే! అని తలంచిన మేము; జ్ఞాన కర్మ భక్తి యోగాలచే భగవంతుని పొందు సామర్థ్యము లేని మేము, ప్రపత్తి ఒక్కటే భగవత్పాప్తికి పరమోపాయమని నెరనమ్మిన మేము, అతని పాదారవింద సాన్నిధ్యాన్ని పడయుటే మానవ జన్మకు పరమ పురుషార్థమని భావించిన మేము, ఇప్పుడే గోవింద భజనకు ఉపక్రమించ దలచినాము, అదే ఉజ్జీవన మార్గమని ఈ పద్దతిని మేము ఎన్నుకుని ఈ వ్రతమునకై దీక్షబూనిెనాము. నిద్రించు అతనిని లేపుటా అని సంకోచించక నిద్ర
లేపుతున్నాము. ఆయన కళ్ళు మూసుకున్నా అది తామస నిద్ర కాదు ~ అది యోగ నిద్ర!
మనము ఆర్తితో గోవిందా అని ప్రార్థిస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అతడు మన మనశ్శుద్దినే కానీ మన బాహ్య ఆడంబరాలను చూడడు. కనుక సౌభాగ్యవతులారా! మీరు వచ్చి నియమాలతో సాంగశరణాగతి చేద్దాము రండి ~ అని చెబుతూ ఉంది గోదా దేవి!
ఈ పాశురానికి అనువాద సీస పద్యము:
( రచయిత ~ కీ.శే. కుంటిమద్ది శేష శర్మ గారు):
భౌతిక భోగ సౌభాగ్య భూషితలారా!
పరమ పదాప్తికి పథము గనుడు
నీరాడి వేకువ క్షీరోదశాయి ప
న్నీరేజములను గీర్తించి మేము;
చేసెడి వ్రతనిష్ట చెప్పెద చెలులార;
కైకోము పాల్ నేయిగాని, మేము
పూలను గైసేయబోము కొప్పులయందు,
కాటుక వెట్టము కన్నుగవకు
చేయగూడని చేతలు చేయబోము,
పరుల బాధించు పలుకులు పలుకబోము
చేతనయినంత యిత్తుము చేతులెత్తి
బీదలకు బూజ్యపాదుల కాదరమున!
(ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్)